బంగారం ఆశతో వృద్ధురాలి ప్రాణం తీశారు
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు అపహరణ.. ప్రధాన నిందితుడిపై గతంలో మూడు ఆస్తి సంబంధిత కేసులు నమోదు.. అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం..

విజయవాడ, జూలై 17(వి10టివి):
విజయవాడలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళను హత్య చేసి బంగారు ఆభరణాలు అపహరించిన కేసును వన్టౌన్ పోలీసులు గంటల్లోనే ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేయడంతో పాటు ఓ బాల నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో ప్రధాన నిందితుడు మృతురాలికి దూరపు బంధువేనని, అతడిపై గతంలో మూడు ఆస్తి సంబంధిత కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. క్లూస్ బృందం, నిఘా దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుంటూరు జిల్లా నులకపేటలో పట్టుకున్నారు.ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని నగర పోలీసు కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు నగదు బహుమతితో అభినందించారు.
