17న విజయవాడ తూర్పులో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక
కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో నిర్వహణ.. ఉదయం 10 గంటల నుంచి ప్రజల నుంచి అర్జీల స్వీకరణ.. జిల్లాస్థాయి అధికారులు పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపు..

విజయవాడ ,జులై 16:విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నెల 17వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఈ కార్యక్రమం జరగనుందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమస్యలు, వినతులు, ఫిర్యాదులను ఈ కార్యక్రమంలో అధికారులకు నేరుగా సమర్పించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు.ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
