కురుమద్దాలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం
రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టిన లారీ మచిలీపట్నం సమీపంలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కృష్ణాజిల్లా, జూలై 23 (వి10టివి): కృష్ణాజిల్లా మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారిపై కురుమద్దాలి వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
మృతులను మచిలీపట్నం సమీపంలోని ఉల్లింగిపాలెం గ్రామానికి చెందిన ఒడుగు నరేంద్ర (22), బందర్కోటకు చెందిన వనమూడి కుమార్ (37)గా పోలీసులు గుర్తించారు. ప్రమాద తీవ్రతకు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి, లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

